
- సీఎంకు ఈబీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం స్కీమ్ను అగ్రవర్ణ పేద విద్యార్థులకు కూడా అమలు చేయాలని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అగ్రవర్ణాలు అయిన రెడ్డి, కమ్మ, బ్రహ్మణ, ఆర్యవైశ్య, వెలమ, క్షత్రియ, కాపు, బలిజ, ముస్లిం, ఒంటరి కులాల్లో కూడా పేదలు ఉన్నారని గుర్తుచేశారు.
వీరిని ఈ స్కీమ్కు దూరం పెట్టడంతో ఈ కులాల్లోని నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నదని పేర్కొన్నారు. చాలా మంది బీటెక్, పీజీలు చదివి ఉద్యోగాల్లేక ఖాళీగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అగ్రవర్ణాలు కూడా ఓట్లు వేశారని గుర్తుచేశారు. ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అగ్రవర్ణ పేద నిరుద్యోగులకు ఈ స్కీమ్ను అమలు చేయాలని ఆయన కోరారు.